అక్షరటుడే, ఇందూరు: Nizamabad : వర్షాకాలం (monsoon season) వచ్చిందంటే వ్యాధుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. ప్రధానంగా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రంగా ఉండాలి. ఇలా ఉండాలంటే ప్రజలతోపాటు నగరపాలక సంస్థలోని ఎంహెచ్ఓ(MHO).. శానిటరీ విభాగం ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుంది. కానీ, నిజామాబాద్ నగర పాలక సంస్థ(Nizamabad municipal corporation)లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
Nizamabad : వైద్యాధికారిని నియమించరే..
నిజామాబాద్ బల్దియాలో ప్రధాన అధికారి కమిషనర్(commissioner). ఆ తర్వాత స్థానం డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ సిటీ ప్లానర్ వంటివి ప్రధానమైనవి. అయితే గత రెండు నెలలుగా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం ఆ రెండు పోస్టులను భర్తీ చేశారు. కానీ గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న మున్సిపల్ వైద్యాధికారి పోస్ట్ మాత్రం భర్తీ చేయలేదు. ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే పోస్టును ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పారు.
Nizamabad : ఇదీ పరిస్థితి..
రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్లలో నిజామాబాద్ ఒకటి. సుమారు నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు. ఇంత ప్రాచుర్యం ఉన్నా.. గత రెండేళ్లుగా ఎంహెచ్వో ను నియమించలేరు.
బల్దియా పరిధిలో మొత్తం ఎనిమిది మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఇందులో రెగ్యులర్ ముగ్గురు కాగా.. అయిదుగురు ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ ఒకరికి కుక్కల నియంత్రణ విభాగం, మరొకరికి డంపింగ్ యార్డ్ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదనే అపవాదు ఉంది.
Nizamabad : వర్షాకాలం ఇబ్బందులు….
ప్రజారోగ్యాన్ని కాపాడటం, ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచటం, మురుగునీటి వ్యవస్థను నిర్వహించటం, వ్యాధుల వ్యాప్తిని నివారించడం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ప్రధాన విధి. అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అలాగే హోటళ్లు, కల్తీ ఆహారం, తినుబండారాలపై నియంత్రణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ, నగరంలో ఇలాంటి తనిఖీలు చేపట్టిన దాఖలాలు తక్కువగానే ఉన్నాయి. ఒకటి, రెండుసార్లు జరిమానా విధించి చేతులు దులిపేసుకుంటున్నారు. రెగ్యులర్ అధికారి ఉండి, నిత్య పర్యవేక్షణ ఉంటేనే కల్తీ ఆహారాన్ని నివారించే అవకాశం ఉంటుంది. దీనికితోడు కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది.
బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సిందే
ఎంహెచ్ఓ పోస్టు కోసం ఇప్పటికే సీడీఎంఏ కు లేఖ రాశాం. ప్రజారోగ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత. రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైనా విధులను సక్రమంగా నిర్వహించాల్సిందే. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. – దిలీప్ కుమార్, కమిషనర్