అక్షరటుడే, వెబ్డెస్క్: Malaria Vaccine | ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ RTS,S ధరను భారత్ బయోటెక్ (Bharat Biotech) భారీగా తగ్గించింది. పిల్లల కోసం తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ధరను 50 శాతం మేర తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్, గ్లోబల్ బయోఫార్మా కంపెనీ (global biopharma company) GSK ప్రకటించాయి. 2028నాటికి దీని ధర 5 డాలర్ల కంటే దిగువకు వచ్చే అవకాశముంది. 2025 చివరి నాటికి 12 ఆఫ్రికన్ దేశాల్లో (African countries) వ్యాక్సిన్ విడుదల చేయనున్నారు. మలేరియాను పూర్తిగా నివారించడంతో పాటు అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తాజాగా ధరను తగ్గించారు.
GSK, PATH, ఇతర భాగస్వాములు అభివృద్ధి చేసిన RTS,S వ్యాక్సిన్ను 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సిఫారసు చేసిన మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఇదే. మరోవైపు, భారత్ బయోటెక్ (Bharat Biotech) కొత్త హై-అవుట్పుట్ సౌకర్యాలలో 200 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టి GSK నుంచి కీలకమైన సాంకేతిక బదిలీని తీసుకుంది. ఈ నేపథ్యంలో మలేరియా వ్యాక్సిన్ ధరను సగానికి సగం తగ్గించాలని భారత్ బయోటిక్ నిర్ణయించింది. మలేరియా వల్ల లక్షలాది మంది పిల్లలు, కుటుంబాలపై భారాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. మలేరియా నుంచి పిల్లలను రక్షించాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని GSK చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ తెలిపారు.