అక్షరటుడే, వెబ్డెస్క్: South Central Railway | తెలంగాణలోని రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) శుభవార్త చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలో మెమో రైళ్లు అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy) బుధవారం కలిశారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయాణికుల కోసం.. త్వరలో MEMO రైళ్లు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. 2026 మే నుంచి కాజీపేటలో కోచ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
South Central Railway | మెమో రైళ్లు అంటే..
తెలంగాణలో ప్రస్తుతం కొన్ని డెమో(DEMU) రైళ్లు నడుస్తున్నాయి. డెమో అంటే డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లు. తక్కువ దూరాల కోసం వీటిని వినియోగిస్తారు. అయితే కేంద్ర మంత్రి రాష్ట్రంలో మెమో రైళ్లను తీసుకు వస్తామని ప్రకటించారు. మెమో(MEMO) మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ను సూచించే రైళ్లు తక్కువ, మధ్యస్థ దూరాల కోసం వినియోగిస్తారు. ఇవి ఎలక్ట్రిక్ రైళ్లు. ముఖ్యంగా నాన్-అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాలలో అనుకూలంగా ఉంటాయి.
సబర్బన్ రైళ్ల కంటే కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి మెమో రైళ్లను ఉపయోగిస్తారు. అంతేగాకుండా ఇవి సబర్బన్ రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. ఈ రైళ్లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ(Rail Coach Factory), చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలలో తయారు చేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న మెమో రైళ్లు త్వరలో తెలంగాణలో అడుగు పెట్టనున్నాయి.