అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలతో పాటు, సినీ ప్రముఖులు, వ్యాపారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)పై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఈ కేసు విచారణలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Phone Tapping Case | ఎన్నికల ముందు రెచ్చిపోయారు..
బీఆర్ఎస్ హయాంలో ఎప్పటి నుంచో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్ఐబీ అధికారులు(SIB officers) రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేతలతో పాటు వారి అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారు. రాష్ట్రంలో 2023 నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో నవంబర్ 15 నుంచి 30 వరకు 15 రోజుల్లోనే 4,013 ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రణీత్ రావు(Praneeth Rao) అండ్ టీమ్ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహించారు. 618 మంది పోన్ ట్యాపింగ్ జరిగిందని సమాచారం.
Phone Tapping Case | బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాప్
ప్రతిపక్ష నేతలతోపాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఫోన్ట్యాపింగ్ నిందితులతో పాటు బాధితుల స్టేట్మెంట్లను కూడా సిట్ రికార్డు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. అంతేగాకుండా మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్య ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో వీరికి నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయాలని సిట్(Sit) యోచిస్తోంది. కాగా.. ఇప్పటి వరకు 228 మంది వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు.
Phone Tapping Case | విచారణ వేగవంతం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావుతో పాటు ఏ2 ప్రణీత్రావును వరుసగా విచారిస్తున్నారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు(SIB Chief Prabhakar Rao) ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికా పారిపోయి ఇటీవల తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు జులై 5 వరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు(Supreme Court) రక్షణ కల్పించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏ2 ప్రణీత్రావును పోలీసలు అరెస్ట్ చేశారు.