More
    HomeజాతీయంConstitutional Assassination Day | ఎమర్జెన్సీ పీడలకు 50 ఏళ్లు.. నేడు రాజ్యాంగ హత్యా దినం

    Constitutional Assassination Day | ఎమర్జెన్సీ పీడలకు 50 ఏళ్లు.. నేడు రాజ్యాంగ హత్యా దినం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Constitutional Assassination Day | భారత్​లో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏటా ‘రాజ్యాంగ హత్యా దినం’ జరుపుతామని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం(Modi government) 2024 జులై 12న ప్రకటించింది. ఈ క్రమంలో బుధవారం (జూన్ 25న) తొలిసారిగా అధికారికంగా ‘రాజ్యాంగ హత్యా దినం’ జరగబోతోంది.

    కాగా.. ఎన్‌డీఏ ప్రభుత్వ వాదనను కాంగ్రెస్ విభేదిస్తోంది. ఎమర్జెన్సీ(Emergency) వల్ల రాజ్యాంగ హత్య జరిగిందనే వాదనలో వాస్తవం లేదని హస్తం పార్టీ అంటోంది. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌(Congress)కు మద్దతుగా నిలిచారని గుర్తుచేస్తోంది.

    సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘జూన్‌ 25’న అర్ధరాత్రి వేళ యావత్ దేశాన్ని కుదిపేసే నిర్ణయం కేంద్రం నుంచి ఒకటి వెలువడింది. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నిశీ రాత్రివేళ రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌ ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సిఫారసు మేరకు దేశ అధ్యక్షుడు ఈ ప్రకటన వెలువర్చారు. దీంతో 1975 జూన్ 25న భారత్​లో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ఇది మార్చి 21,1977 వరకు అది కొనసాగింది.

    Constitutional Assassination Day | అసలేం జరిగిందంటే…

    1966 జనవరి 24న ఇందిరాగాంధీ తొలిసారిగా భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1971 వరకు సాఫీగానే సాగింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్‌(Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్‌పై 1,11,810 ఓట్ల ఆధిక్యంతో ఇందిర గెలిచారు. కానీ, ఈ ఎన్నికల ఫలితాన్ని రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరాగాంధీ దుర్వినియోగం చేసి, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారనేది రాజ్​నారాయణ్​ ఆరోపణ.

    Constitutional Assassination Day | ఏకంగా ఏడు అభియోగాలు..

    అలహాబాద్ హైకోర్టులో ఇందిరకు వ్యతిరేకంగా మొత్తం ఏడు అభియోగాలు దాఖలయ్యాయి. ఇందిర ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్‌పాల్ కపూర్‌ను నియమించుకున్నారనేది ఒక అభియోగం. ఎన్నికల ప్రచార సభల స్టేజీల నిర్మాణం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఎంపాయీస్​ను వినియోగించుకున్నారనేది మరో ఆరోపణ. ఓట్ల కోసం ఇందిరాగాంధీ డబ్బులు పంచారని, బోగస్‌ ఓటింగ్‌‌ వేయించారనే అభియోగాలు కూడా మోపారు. ఇలా ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించడం దేశంలో నాడు పెను సంచలనమే సృష్టించింది.

    Constitutional Assassination Day | హైకోర్టులో షాక్..

    ఇందిర ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు వినేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకారం తెలిపింది. అలా 1971 మార్చి నుంచి 1975 జూన్ వరకు వాదనలు జరిగాయి. జూన్ 12, 1975న న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్‌లాల్ సిన్హా(Judge Justice Jagmohanlal Sinha) సంచలన తీర్పునిచ్చారు. రాజ్‌నారాయణ్ చేసిన ఏడు ఆరోపణల్లో అయిదు ఆరోపణల నుంచి ఇందిరాగాంధీకి ఊరట లభించింది.

    కానీ, ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులు, సర్కారు యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారనే అభియోగాల్లో ఇందిరను దోషిగా నిర్ధారించి, ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. మరో ఆరేళ్లపాటు లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు. ఒక ప్రధాని ఎన్నిక విషయంలో హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా, యావత్​ ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    Constitutional Assassination Day | సుప్రీం ఆంక్షలు.. మరునాడే ‘ఎమర్జెన్సీ’

    అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పుతో షాకైన ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1975 జూన్ 22, న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. జూన్ 24, 1975న అలహాబాద్ హైకోర్టు తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇంజంక్షన్ ఆర్డర్లు జారీ చేసింది. ప్రధానిగా ఇందిరాగాంధీ(Indira Gandhi) పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు, ప్రసంగాలు ఇచ్చేందుకు సుప్రీం అనుమతులు ఇచ్చింది. కానీ, పార్లమెంటులో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా కోర్టులు ఆంక్షలు విధించింది. తుది తీర్పు వెలువరించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

    దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ఆంక్షలను ఎదుర్కోవాల్సి రావడంతో ఇందిరాగాంధీ నాడు ఆలోచనలో పడ్డారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి స్వరణ్‌సింగ్‌(Swaran Singh)ను తాత్కాలిక ప్రధానిగా చేయాలనే ఆలోచనను ఇందిరాగాంధీ చేశారనే వాదన ఉంది. ఆమె ప్రతిపాదనను నాటి కేంద్ర మంత్రి జగ్జీవన్​రామ్ వ్యతిరేకించారని పలు పుస్తకాల్లో రాశారు కూడా. ప్రధానిగా స్వరణ్ సింగ్‌ను నియమిస్తే.. తాను కూడా బరిలో ఉంటానని జగ్జీవన్​రామ్ పేర్కొన్నట్లు పుస్తకాల్లో రాసుకొచ్చారు.

    మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీపై యుద్ధమే ప్రకటించాయి. 1975 జూన్ 25న మధ్యాహ్నం ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా లోక్‌ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (Jayaprakash Narayan) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

    Constitutional Assassination Day | ‘ఎమర్జెన్సీ’ ప్రకటన

    1975 జూన్ 25న ఢిల్లీ వేదికగా భారీ సభ జరిగిన తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఒక సీక్రెట్ లెటర్‌ను ఆదే రోజు నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌కు పంపించారు. “దేశానికి భారీ ముప్పు పొంచి ఉంది. అంతర్గత భద్రతకు కూడా ముప్పు కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీని ప్రకటించే అంశాన్ని పరిశీలించగలరు” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

    అలా అదే రోజు అర్ధరాత్రి 12 గంటలు కావడానికి కొన్ని నిమిషాల ముందే నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్(Fakhruddin Ali Ahmed) కీలక ప్రకటన వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. మరుసటి రోజు (జూన్ 26, 1975న) ఆలిండియా రేడియోలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఇందిరా గాంధీ మాట్లాడారు. “ప్రియమైన సోదర, సోదరీమణులారా మన రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించారు. ఎవరూ భయాందోళన అవసరం లేదు” అని ఆమె పేర్కొన్నారు.

    Constitutional Assassination Day | భావ ప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం

    1975 జూన్ 30న మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (MISA)లో ఇందిరాగాంధీ సర్కారు కీలక సవరణలు చేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలిపే వారిని, మాట్లాడే వారిని విచారణ లేకుండానే నిర్బంధించొచ్చు’ అనే వివాదాస్పద అంశాన్ని అందులో చేర్చారు. ఇదే సమయంలో దేశ ప్రజలకు చేరువయ్యేందుకు జులై 1, 1975న ఇందిరాగాంధీ 20 పాయింట్ల కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారానే ఆర్థిక, సామాజిక సంస్కరణలను సాధిస్తామని ఆమె వెల్లడించారు.

    READ ALSO  MLA Prashanth Reddy | రైతులను మోసం చేసినందుకా సంబరాలు : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

    అదే రోజు పౌర స్వేచ్ఛలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో పెల్లుబుకుతున్న ప్రజా నిరసనలను కట్టడి చేసేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆగస్టు 5, 1975న నిరంకుశ మిసా చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. దీనిని ఆసరాగా చేసుకొని ఎమర్జెన్సీ ముగిసే వరకు దేశంలో లక్షలాది మందిని పోలీసులు, అధికారులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి జైళ్లలో వేశారు.

    రాజకీయ, విద్యార్థి సంఘాల, యువజన సంఘాల నాయకులు, జర్నలిస్టులు, మీడియా సంస్థల నిర్వాహకులను నాటి ఇందిర సర్కారు లక్ష్యంగా చేసుకుందనేది ఆరోపణ. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా గొంతు పెగల్చే వారిపై మిసా (MISA)ను నిర్ధాక్షణ్యంగా ప్రయోగించారు. తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 దేశ ప్రజలకు కల్పించిన 7 హక్కులను కాలరాస్తూ జనవరి 9, 1976న ప్రకటన వెలువడింది.

    Constitutional Assassination Day | ఇందిరకు అనుకూలంగా సుప్రీం తీర్పు

    నవంబరు 7, 1975న దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. 1971 నాటి రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అవకతవకలకు పాల్పడినట్లు, అధికార దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీం తేల్చి చెప్పింది. నాడు ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా చేసిన ఎన్నికల ఖర్చు ప్రభుత్వపరమైందిగా పరిగణించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎంపీగా ఆమె అన్ని అధికారాలను పొందొచ్చని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 1976 నవంబరు 2న పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. అప్పటి వరకు కోర్టులకు ఉన్న ప్రధాని లాంటి వారికి సంబంధించిన వ్యవహారాలను సమీక్షించే హక్కులను ఈ రాజ్యాంగ సవరణ కుదించింది.

    Constitutional Assassination Day | మీడియా గొంతుపై ఉక్కుపాదం

    నాటి ఎమర్జెన్సీ సమయంలో మీడియాపై ఇందిరాగాంధీ సర్కారు ఉక్కుపాదం మోపింది. జర్నలిస్టుల, మీడియా సంస్థల నిర్వాహకుల గొంతును నులిమేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యజమాని రాంనాథ్ గోయెంకాను వేధించింది. కులదీప్ నయ్యర్ సహా సుమారు 250 మందికిపైగా జర్నలిస్టులను నిర్బంధించింది.

    Constitutional Assassination Day | సంజయ్ గాంధీ తీరుపై విమర్శలు

    ఎమర్జెన్సీ కాలంలో ఇందిర తనయుడు సంజయ్ గాంధీ వివాదాస్పదంగా వ్యవహరించారనే వాదన ఉంది. 1976 ఏప్రిల్‌లో ఢిల్లీలోని పలు మురికివాడల ప్రజలను సంజయ్​ బలవంతంగా ఖాళీ చేయించారు. అలా వేలాది మంది అభాగ్యులను నిరాశ్రయులను చేసి, నిలువ నీడ లేకుండా చేశారు.

    1976లో రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలా అదే ఏడాది సెప్టెంబరులో సంజయ్ గాంధీ రంగంలోకి దిగారు. పోలీసుల సహకారంతో ఢిల్లీ పరిధిలో బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించారు. అలా నాడు కోటి మందికిపైగా ప్రజలకు బలవంతపు కుటుంబ నియంత్రణ సర్జరీలు చేయించారని చెబుతుంటారు. ప్రత్యేకించి పేదలు, అణగారిన వర్గాల ప్రజలకే ఈ శస్త్రచికిత్సలు జరిపినట్లు పేర్కొంటారు.

    వేతనాలు తగ్గిస్తామని బెదిరించడం, సాగునీటిని నిలిపివేస్తామని రైతులను బెదిరించడం, పోలీసు రైడ్స్‌తో సామాన్య ప్రజలను భయపెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినట్లు నాటి వార్తా పత్రికలు రాసుకొచ్చాయి. నాటి అపరిశుభ్ర ప్లేస్​లలో హడావిడిగా సర్జరీలు చేయడం వల్ల వేలాది మంది చనిపోయినట్లు చెబుతుంటారు. ఈ పరిణామాలన్నీ 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమికి కారణమయ్యాయి.

    READ ALSO  Godavari River | గోదావ‌రి జ‌లాల వివాదంపై కేంద్రం న‌జ‌ర్‌.. కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటుపై క‌స‌ర‌త్తు

    Constitutional Assassination Day | న్యాయవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి

    ఎమర్జెన్సీ సమయంలో న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. విచారణ లేకుండానే పోలీసులు తమను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ పలువురు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తమకు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయని వాదించారు. కానీ, వ్యక్తిగత హక్కుల కంటే ప్రభుత్వ అధికారమే ముఖ్యమని జబల్‌పూర్‌ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (ఏడీఎం) స్పష్టం చేశారు. పిటిషనర్లకు హెబియస్ కార్పస్ రిట్‌ను ఇవ్వలేమని చెప్పారు. అలా ఈ కేసు (ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా) సుప్రీంకోర్టు మెట్లెక్కింది.

    1976లో సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నలుగురు న్యాయమూర్తులు జబల్‌పూర్‌ ఏడీఎం తీర్పును సమర్ధించారు. “జాతీయ ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రజలు ఏదైనా కోర్టును ఆశ్రయించడాన్ని నిలిపివేయొచ్చు. ఆర్టికల్ 21లోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల అమలును తాత్కాలికంగా ఆపోచ్చు” అని నాటి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, వైవీ చంద్రచూడ్, పీఎన్ భగవతి తెలిపారు. కానీ, ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా తద్భిన్నంగా వ్యాఖ్యానించారు. “జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి అత్యంత ముఖ్యమైనవి.. ఎమర్జెన్సీ కాలంలోనూ వీటిని ప్రజల నుంచి ఎవరూ లాక్కోలేరు” అని స్పష్టం చేశారు.

    కాలగమనంలో ఇందిర సర్కారు కూలిపోయిన తర్వాత జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ సమయంలోనూ ఆర్టికల్ 21 అమల్లో ఉండేలా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.

    Constitutional Assassination Day | ఎమర్జెన్సీ ఎత్తివేతకు ముందు…

    1976 రానే వచ్చేసింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ పాలనా కాలం ముగిసింది. దేశంలో ఇక సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. కానీ, ఇందిర మరో అనూహ్య నిర్ణయం ప్రకటించారు. లోక్‌సభ గడువును మరో ఏడాది పొడిగిస్తూ ఫిబ్రవరి 4, 1976న ప్రకటన విడుదల చేశారు. ఈ అదనపు ఏడాది పాలనా కాలంలోనూ ఎమర్జెన్సీని కొనసాగించేందుకే ఇందిర మొగ్గుచూపారు.

    ఇక జనవరి 18, 1977న ఇందిరాగాంధీ ముఖ్యమైన ప్రకటన చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తూ.. దేశంలో ఎన్నికలు నిర్వహిస్తానని తెలిపారు. దీంతో దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలు అన్నీ ఏకధాటిపైకొచ్చాయి. అన్నీ కలిసి జనవరి 24, 1977న జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీకి మొరార్జీ దేశాయ్ సారథ్యం వహించారు.

    1977.. మార్చి 16 నుంచి 20 వరకు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇందిరాగాంధీ ప్రధాని పదవిని కోల్పోయారు. జనతా పార్టీ 345 సీట్లను గెల్చుకుంది. దీంతో దేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లుగా మార్చి 21, 1977న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా మార్చి 23, 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ కొనసాగింది. మార్చి 24, 1977న ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...