అక్షరటుడే, వెబ్డెస్క్: MLA Prashanth Reddy | రైతు భరోసా (Rythu Bharosa) జమ చేసినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి (Vemula Prashanth Reddy) స్పందించారు. రైతుల్ని నమ్మిచ్చి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.
కేసీఆర్ (KCR) హయాంలో 11 విడుతల్లో రూ.75,000 కోట్లు జమ చేశామన్నారు. కానీ ఏనాడు ఇంత హంగామా చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి రూ.7,500 కాకుండా రూ.5,000 ఇచ్చిందన్నారు. రెండో విడత పూర్తిగా ఎగ్గొట్టి, మూడో పంటకు 4 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు అని మాటమార్చిందన్నారు. రైతు బీమా ప్రీమియం కట్టడం లేదని విమర్శించారు. కౌలు రైతులకు ఇస్తానన్న రైతుభరోసా ఇంకా అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు ఎందుకు చేసుకుంటుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్రెడ్డి రైతుభరోసా జమ చేసి, సంబరాలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.