అక్షరటుడే, వెబ్డెస్క్: Airlines | అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) యావత్ దేశాన్ని కలిచి వేసింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మృతి చెందారు. విమానం భవనంపై కూలడంతో అందులోని మెడికల్ కాలేజీ విద్యార్థులు సైతం చనిపోయారు. మొత్తం 270 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (Vijay Rupani) సైతం మరణించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది.
విమానం ప్రమాదం అనంతరం డీజీసీఏ (DGCA) ఎయిర్ ఇండియా (Air India)కు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని గతంలో ఆదేశించింది. అయితే ఇటీవల పలు విమానాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతేగాకుండా ఏకంగా గాలిలో ఉండగా.. ఇండిగో (Indigo) విమానంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పైలట్ బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో డీజీసీఏ చర్యలు చేపట్టింది.
Airlines | లోపాలను సరిచేసుకోవాలి
విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. విమానాల్లో లోపాలను వెంటనే సరిచేయాలని సూచించింది. ఎయిర్పోర్టుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు వారం రోజుల గడువు ఇచ్చింది. వారంలో తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.