అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఓ వైపు నిందితులను విచారిస్తూనే.. గతంలో ఫోన్లు ట్యాపైన వారిని పిలిచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etala Rajender) సిట్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడే తన ఫోన్ ట్యాప్(Phone Tap) చేశారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో హుజురాబాద్(Huzurabad)లో తనను ఓడగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దేశద్రోహులు, టెర్రరిస్టులపై నిఘా పెట్టాల్సిన ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిందన్నారు. నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. 2018 నుంచే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు తెలిపారు.
Phone Tapping Case | బెదిరింపులకు పాల్పడ్డారు
హుజురాబాద్ 2021 ఉప ఎన్నికల సమయంలో తనపై నిఘా పెట్టారని ఈటల పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్ చేసి తాను ఎవరితోనైతే మాట్లాడనో వారిని బెదిరించారని ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్(Phone Tapping) ద్వారా అన్ని తెలుసుకున్నారని పేర్కొన్నారు. 2023లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడగొట్టారని తెలిపారు.
Phone Tapping Case | ధైర్యం లేని వాళ్లే చేస్తారు
దమ్ము, ధైర్యం లేని వాళ్లు, యుద్ధం చేతకాని వాళ్లే ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తారని ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులు మాట్లాడిన సంభాషణలు కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు తెలిపారన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తోందని విమర్శించారు. విద్యుత్ కమిషన్ ఎటుపోయిందని, కాళేశ్వరం(Kaleshwaram) నివేదిక ఏమైందని ఈటల ప్రశ్నించారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) మధ్య లోపాయికారి ఒప్పందం లేకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.