అక్షరటుడే, వెబ్డెస్క్:Jeedimetla | ప్రస్తుతం సమాజంలో బంధాలు, అనుబంధాలకు తావు లేకుండా పోయింది. ఆస్తులు, వివాహేతర సంబంధాలు(Extramarital Affairs), ప్రేమ పేరిట అయినవారినే చంపుకుంటున్నారు. ప్రస్తుతం అవుతున్న నేరాల్లో ఎక్కువ శాతం వీటిమూలంగా జరుగుతున్నాయి. కన్నవారిని సైతం కడతేర్చడానికి పిల్లలు వెనకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ బాలిక ప్రియుడితో కలిసి తన తల్లిని హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్లలోని ఓ కాలనీలో నివాసం ఉంటే బాలిక(16) పదో తరగతి చదువుతోంది. ఆమెకు శివ (19) అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడాగా అది ప్రేమగా మారింది. అయితే ఆ విషయం బాలిక తల్లి అంజలికి తెలియడంతో మందలించింది. పదో తరగతికే ప్రేమ ఏంటని బెదిరించింది. దీంతో వారం క్రితం శివతో బాలిక వెళ్లిపోయింది. ఈ మేరకు తల్లి అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.
Jeedimetla | అడ్డు తొలగించుకోవాలని..
ప్రియుడితో వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన బాలిక తన తల్లిని అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసింది. ఈ మేరకు తన ప్రియుడు పగిల్ల శివ (19) అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్ (18) సహాయంతో తన తల్లిని హత్య చేసింది. నల్గొండ నుంచి శివ, యశ్వంత్ బాలిక ఇంటికి వచ్చారు. బాలిక తల్లి పూజ చేస్తుండగా.. శివ వెనక నుంచి దాడి చేశాడు. అనంతరం సదరు బాలిక తన తల్లి తలపై సుత్తితో కొట్టగా.. యశ్వంత్ గొంతు కోశాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బాలిక తల్లి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించి, దొరలను ఎదిరించిన చాకలి ఐలమ్మ ముని మనవరాలు కావడం గమనార్హం.