అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs ENG : ఇంగ్లాండ్ (England) పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు (Indian cricket team) రికార్డుల మోత మోగిస్తోంది. లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ లేని రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి.
93 సంవత్సరాల భారత జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని రికార్డును నమోదు చేసింది. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఐదు వ్యక్తిగత సెంచరీలు చేయడం దాదాపు తొమ్మిది దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఇండియా 1932 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. ఈ మ్యాచ్తో సహా 591 టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పటికీ, ఏ టెస్టులోనూ ఐదు సెంచరీలు చేసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు.
IND vs ENG : వారెవ్వా పంత్..
లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించారు. రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీలు సాధించారు. టెస్ట్ 4వ రోజు రాహుల్, పంత్ కలిసి జట్టును ముందుండి నడిపించారు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
వికెట్ కీపర్ తన ఎనిమిదో టెస్ట్ సెంచరీకి చేరుకునే క్రమంలో చరిత్ర సృష్టించాడు. టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించిన రెండో వికెట్ కీపర్గా అతను రికార్డులకెక్కాడు. గతంలో ఈ అరుదైన ఫీట్ ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. అయితే, ఫ్లవర్ తన స్వదేశంలో ఈ ఘనత సాధించగా, పంత్ మాత్రం విదేశీ గడ్డపై రెండుసార్లు చేసిన తొలి వికెట్ కీపర్ గా ఘనతను సొంతం చేసుకున్నాడు.
IND vs ENG : దిగ్గజాల సరసన రాహుల్..
మరోవైపు కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా రికార్డులకెక్కాడు. తన తొమ్మిదో టెస్ట్ సెంచరీ సాధించిన రాహుల్ రెండు ప్రధాన మైలురాళ్లను నమోదు చేశాడు. ఇంగ్లాండ్లో ఓపెనర్గా ఇది అతని మూడో సెంచరీ. ఇంగ్లాండ్ లో ఒక ఆసియా ఓపెనర్ చేసిన అత్యధిక సెంచరీ. గతంలో ఈ రికార్డును సాధించిన సునీల్ గవాస్కర్ Sunil Gavaskar, రాహుల్ ద్రవిడ్ Rahul Dravid, విజయ్ మర్చంట్ Vijay Merchant, రవిశాస్త్రి Ravi Shastri, తమీమ్ ఇక్బాల్ Tamim Iqbal ఇంగ్లాండ్లో ఓపెనర్లుగా రెండు సెంచరీలు సాధించారు. తాజాగా రాహుల్ వారి సరసన చేరాడు.