అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | దేవుళ్ల పేరుతో ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు (DCC President Kailas Srinivas Rao) ఆరోపించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి (MLA Venkata Ramana Reddy) ఎన్నికలు రాగానే ప్రజలు, ప్రజాక్షేత్రం గుర్తొస్తాయన్నారు. గత ఎన్నికల ముందు గుళ్లు గోపురాలు తిరుగుతూ దేవుడిపేరు అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పడు శఠగోపం పెట్టారన్నారు. కామారెడ్డిని అభివృద్ధి చేయమని కోరితే హైదరాబాద్ వెళ్లి హైడ్రా (Hydra) గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు.
Kamareddy Congress | భూకబ్జాలు అలాగే ఉన్నాయి..
ఎమ్మెల్యే చేసిన వాగ్ధానాలు ఒకటి కూడా అమలు చేయలేదని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇంటి వద్ద న్యాయవాద బృందాన్ని ఏర్పాటు చేసి కబ్జాలకు గురైన భూములను ఇప్పిస్తానని ప్రగల్భాలు పలికారని, ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే ముందు డిగ్రీ కాలేజ్ (Kamareddy Degree College) భూముల్లో జరిగిన కబ్జాల గురించి మాట్లాడాలన్నారు. గ్రామ గ్రామాన ఫిర్యాదుల పెట్టెను పెడితే ఎంతమంది ఫిర్యాదు చేశారు.. ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలన్నారు. అభివృద్ధి జరుగుతుంటే సహించలేక ప్రొటోకాల్ జగడం మొదలుపెట్టారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచి 18 నెలలు గడుస్తున్నా.. కేంద్ర నిధులు తేలేదని, రాష్ట్ర నిధులు తీసుకొచ్చి కామారెడ్డిని అభివృద్ధి చేస్తామంటే దానిపై ఫిర్యాదులు చేస్తూ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతంగా రూ.150 కోట్ల నిధులు తెచ్చి చేస్తానన్న అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షులు నౌసిలాల్ నాయక్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.