అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao | కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు ఉండేవని, కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంతా అస్తవ్యస్తమైందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) విమర్శించారు. సీఎం రేవంత్ నెలకు ఒకసారి కూడా సచివాలయానికి వెళ్లడం లేదని.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడానికే ఆయనకు సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేయడం, కేసులు పెట్టడంపైనే దృష్టి తప్పా.. పాలనపై లేదని విమర్శించారు. ఎప్పుడూ జూబ్లీహిల్స్ ప్యాలెస్(Jubilee Hills Palace), కమాండ్ కంట్రోల్ రూమ్(Command Control Room) లో కూర్చుంటే మీకు సమస్యలు తెలుస్తాయా రేవంత్ రెడ్డి ?’ అని ప్రశ్నించారు. సోమవారం నర్సాపూర్ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చిప్పల్ తుర్తి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం హరీశ్ రావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Harish Rao | ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేక చెత్త సేకరణ చేయడం లేదని హరీశ్ తెలిపారు. ‘గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలని కేసీఆర్(KCR) రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు ఇచ్చి ఇంటింటికీ చెత్తబుట్టలిచ్చి, డంప్ యార్డులు నిర్మించి స్వచ్ఛమైన పల్లెలుగా తయారు చేశారు. కేసీఆర్ ట్రాక్టర్లు ఇస్తే , అందులో డీజిల్ కూడా పోయని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఉందని’ విమర్శించారు. ‘కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? పల్లెలపై మీకు ఉన్న పట్టింపు ఇదేనా?’ అని ప్రశ్నించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, సఫాయి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)మాటలు కోటలు దాటుతాయి.. కానీ చేతలు గడప కూడా దాటని పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో కనీసం వీధి లైట్లు పెట్టడానికి కూడా డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారన్నారు. మీకు హెలికాప్టర్లో ఇంధనం పోయడానికి డబ్బులు ఉంటాయి.. కానీ ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవని విమర్శించారు.
Harish Rao | కమీషన్ ఇస్తేనే బిల్లుల విడుదల
10 శాతం, 20 శాతం కమీషన్ ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వరు కాబట్టి జీతాలు ఇవ్వడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సెక్రెటరీని అడిగితే భయపడుతూ.. ఇప్పటివరకు తన జేబులోంచి రూ.80 వేలు గ్రామపంచాయతీకి ఖర్చు పెట్టానని చెప్పాడన్నారు. ఆయన పెట్టిన రూ.80 వేలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియదన్నారు.