అక్షరటుడే, వెబ్డెస్క్: Mumbai Local Trains | ముంబైలో రైలు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. గత 11 ఏళ్లలో ఏకంగా 29 వేల మంది రైలు ప్రమాదంతోనే మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 8,416 మంది బాధితులను గుర్తించలేదు కూడా. ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో సబర్బన్ రైల్వే వ్యవస్థ (Mumbai Local Trains) అత్యంత ప్రధానమైనవి కాగా, ఈ రైళ్లు.. ఉదయం, సాయంత్రం వేళల్లో జనంతో కిక్కిరిసిపోతాయి. కనీసం నిలబడడానికి కూడా జాగా లేక ప్రజలు వేలాడుతూ ప్రయాణాలు చేస్తుంటారు. ముంబైలోని సబర్బన్ రైళ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు, ప్రయాణికుల ప్రాణాలపై ముప్పు నేపథ్యంలో భారతీయ రైల్వే(Indian Railways) కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు పెద్దగా కనిపించడం లేదు.
Mumbai Local Trains | రైలు ప్రమాదాలతో..
రద్దీ సమయంలో ఫుట్బోర్డులపై వేలాది మంది నిలబడడం, తలుపులు తెరిచి ఉండడం వంటి అనారోగ్యకర పరిస్థితులు అక్కడ పరిపాటి కాగా, ఇవి భారీ ప్రమాదాలకు దారితీస్తున్నాయని అనేక సంఘటనలు నిరూపించాయి. సమాచార హక్కు చట్టం ద్వారా పదకొండేళ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగా రైలు ప్రమాదాల్లో(Train Accidents) మరణించారు. 2014 నుంచి 2024 వరకు ముంబై సబర్బన్ రైల్వే పరిధిలో మొత్తం 29,048 మంది మరణించాని ప్రభుత్వ రైల్వే పోలీసులు(GRP) గణాంకాలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు అంటే 15 వేల మందికిపైగా పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక కిక్కిరిసిన రైళ్లలో వేలాడుతూ ప్రయాణిస్తూ ప్రమాద వశాత్తు కిందపడి 6500 మంది చనిపోయారు.
ప్రమాదంలో కొందరి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కావడంతో బాధితులను గుర్తించడం కష్టసాధ్యమవుతుందని తెలిపారు. ముంబై సబర్బన్ రైల్వే(Mumbai Suburban Railway)లో వెస్ట్రన్ లైన్, సెంట్రల్ లైన్ మరియు హార్బర్ లైన్ అనే మూడు ప్రధాన మార్గాలున్నాయి. ఇవి నగరం నలుమూలలా ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. లోకల్ రైళ్లు ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడుస్తాయి. అయితే రైల్వే బోర్డు (Railway Board) ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ముంబై సబర్బన్ నెట్వర్క్ కోసం కొత్తగా తయారు చేస్తున్న అన్ని కోచ్లలో ఆటోమేటిక్ డోర్ క్లోజర్(Automatic Door Closer) సదుపాయాలు ఉంటాయని ఇటీవల స్పష్టం చేసింది. సేవలో ఉన్న అన్ని రేక్లను రీడిజైన్ చేసి, ముంబై సబర్బన్లోని ఈ రేక్లలో డోర్ క్లోజర్ సదుపాయం కల్పించబడుతుంది అని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.