అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | మొన్నటి వరకు ఎండలతో అట్టుడికిన తెలంగాణ (Telangana)కి ఇప్పుడు చల్లని కబురు అందింది. రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ఈ జిల్లాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందరాదని హెచ్చరించారు.
మిగిలిన జిల్లాల్లోనూ ఈదురు గాలులతో (Thunderstorms) కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణకు రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కొన్ని రోజుల వరకు భారీగా వర్షాలు కురిసినా.. తర్వాత కొన్ని రోజులు ఎండలతో ప్రజలు సతమతం అయ్యారు. తర్వాత మళ్లీ వర్షాలు ఎక్కుగా కురవలేదు. నేటి నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ కావడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి.