అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్య మార్గాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా భారీ బాంబులతో దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో ఓ పోస్టు చేశారు. “ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్(Iranian President Massoud Pezeshkian)తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితి గురించి ఇద్దరం వివరంగా చర్చించాం. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయ శాంతిభద్రతలు, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య ప్రయత్నాలు ప్రారంభించాలని పునరుద్ఘాటించాం” అని ప్రధాని మోదీ ‘X’లో రాశారు.
ఇరాన్ అణు కార్యక్రమం తమ దేశానికి ముప్పుగా పరిణమిస్తుందంటూ ఇజ్రాయెల్(Israel) ఆ దేశంపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగాయి. తాజాగా అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధ రంగంలోకి ప్రవేశించింది. ఇరాన్లోని మూడు కీలకమైన అణుస్థావరాలపై భారీ బంకర్ బస్టర్ బాంబులతో (Bunker buster bombs) దాడి చేసింది.