అక్షరటుడే, ఆర్మూర్: EX Mla Jeevan Reddy | తెలంగాణ రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్ కాళేశ్వరం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ద్వారా నీటి విడుదల జరిగి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR) అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి అవగాహన లేని కాంగ్రెస్, బీజేపీలు ప్రాజెక్ట్పై విషం కక్కుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహా జలశక్తి పీఠమని, దేశానికే మార్గదర్శకం చేసిన సాగునీటి పాఠమని జీవన్ రెడ్డి అభివర్ణించారు.
EX Mla Jeevan Reddy | హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే, కాంగ్రెస్ విషం పారిస్తోందని జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిని అంటగట్టి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి అవమానించిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.