అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) షెడ్యూల్ త్వరలో వెలువడుతుందని ఇటీవల పలువురు మంత్రులు ప్రకటన చేశారు. నెలాఖరులో షెడ్యూల్ విడుదల చేసి వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. దీంతో పల్లెల్లో ఆశావహులు, నాయకులు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
Local Body Elections | ఇంకా నిర్ణయం జరగలేదు
మహేశ్గౌడ్ ఆదివారం నిజామాబాద్ (Nizamabad)లో మాట్లాడారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని ఆయన తెలిపారు. మంత్రివర్గంలో (Cabinet) చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ నెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే స్థానిక ఎన్నికలపై చర్చించి ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
Local Body Elections | రేపు మంత్రివర్గ సమావేశం
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి జలాలను అక్రమంగా తరలిస్తే ఊరుకోమని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దని ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. అయితే సోమవారం నిర్వహించే కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
Local Body Elections | రిజర్వేషన్లపై స్పష్టత కరువు
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల (BC Reservations) బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. ఆ బిల్లులను కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి వాటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే పంచాయతీలకు 16 నెలలుగా పాలకవర్గాలు లేవు. ఇన్ఛార్జీల పాలనతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం అయిపోయి కూడా ఏడాది కావొస్తోంది. దీంతో ఎన్నికల కోసం ఆయా పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు పెడతారా అని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తాజాగా పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.