అక్షరటుడే, వెబ్డెస్క్: Adilabad | ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరిలో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే తెలిసి తెలియని వయసులో కొందరు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. కొత్త వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ చేసి తర్వాత చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి అమానుష ఘటన ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో చోటు చేసుకుంది. స్నేహం పేరిట బాలికను పరిచయం చేసుకుని 12 మంది యువకులు ఆమెను వేధించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉండడం గమనార్హం.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు స్నేహం పేరిట సదరు బాలికతో ఆన్లైన్ చాటింగ్ మొదలు పెట్టాడు. చాటింగ్ చేస్తూ క్రమంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత తన అసలు రూపం బయట పెట్టాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే మొత్తం చాటింగ్ (Chatting) వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.
తనతో అశ్లీలంగా కాల్స్ చేసి మాట్లాడాలని వేధించాడు. తర్వాత ఆ వీడియో కాల్స్ (Video Calls) రికార్డ్ చేసి తన స్నేహితులకూ షేర్ చేశాడు. 12 మంది ఆ వీడియోలను షేర్ చేసుకున్నారు. అంతేగాకుండా ఆ బాలిక పేరిట ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారా దుర్మార్గులు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోల్ని వెంటనే డిలీట్ చేయించినట్లు పోలీసులు తెలిపారు.