అక్షరటుడే, వెబ్డెస్క్: Traffic Challan | రోడ్డు ప్రమాదాల నివారణకు అమలు చేసే ట్రాఫిక్ నిబంధనలను అనేక మంది ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించని వాహనదారులకు పోలీసులు జరిమానాలు వేస్తున్నా కొందరు మారడం లేదు. హెల్మెట్ పెట్టుకోకుండానే బైక్లపై రయ్యున దూసుకెళ్తున్నాఉ. సెల్ఫోన్ మాట్లాడుతూ బైక్ నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వీరికి పోలీసులు జరిమానాలు వేస్తున్నారు. అయితే ఇలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వాహనదారుడిని పట్టుకున్న పోలీసులు బండిపై ఉన్న చలాన్లు చూసి షాక్ అయ్యారు. సదరు వ్యక్తి స్కూటీపై ఏకంగా 233 చలాన్లు ఉండడం చూసి అవాక్కయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ(Hanmakonda) జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ స్కూటీ(ఏపీ12 జీ8379)ని ఆపి బండిపై ఉన్న చలాన్లు చెక్ చేశారు. ఆయన స్కూటీపై 233 చలాన్లు ఉండడం చూసి ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) షాక్ అయ్యారు. ఆ మొత్తం జరిమానాల విలువ రూ.45,350 కావడం గమనార్హం. సదరు బండిపై 2016 నుంచి చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో 90శాతం హెల్మెట్ ధరించకపోవడంతో వేసినవి కావడం గమనార్హం. దీంతో బైక్ను సీజ్ చేసిన పోలీసులు ఫైన్ కట్టి తీసుకువెళ్లాలని సూచించారు.
కాగా.. స్కూటీ యజమాని అస్లా మాట్లాడుతూ.. ఏడాది క్రితం తాను కరీంనగర్కు చెందిన వ్యక్తి నుంచి వాహనం కొన్నానని చెప్పాడు. దానిపై చలాన్లు పెండింగ్ ఉన్నట్లు తెలియదన్నారు. చలాన్లు చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బు కూడా లేదని అస్లాం తెలిపారు. వాహనాన్ని విక్రయించినా రూ.15 వేలకు మించి రావని చెప్పడం గమనార్హం.