అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay | రాష్ట్ర ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)లో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారని తెలిసినా సీఎం రేవంత్రెడ్డి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కేబినెట్, సబ్ కమిటీ నివేదికలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబంపై చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని గతంలో రాహుల్ గాంధీ ఆరోపించారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం విచారణ పేరిట కాలయాపన చేస్తోందని విమర్శించారు.
Bandi Sanjay | సీబీఐకి అప్పగించాలి
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐ (CBI)కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం (KCR Famuly) అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కారు రక్షణ కవచంగా మారిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అందుకే ఆ కేసులను సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Bandi Sanjay | జాతీయ హోదా ఇస్తే పరువు పోయేది
కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇస్తే పరువు పోయేదని బండి సంజయ్ అన్నారు. కూలిపోయిన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఇంకా బీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత..? ఇప్పుడు పంట దిగుబడి ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ లెక్కలను బయట పెట్టాలన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం లేకపోయిన దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు.