అక్షరటుడే, వెబ్డెస్క్: Iran – Israel | ఇరాన్ – ఇజ్రాయెల్ (Iran – Israel) మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్లోని అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో పశ్చిమాసియాలో తీవ్ర అలజడి నెలకొంది. ఇన్ని రోజులు ఇజ్రాయెల్– ఇరాన్ దాడులు చేసుకుంటుండగా శనివారం రాత్రి అమెరికా (America) ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై ఆదివారం ఉదయం డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.
ఇరాన్పై అమెరికా దాడులతో ముందుగానే ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ భూభాగంపై టెహ్రాన్ (Tehran) దాడులకు దిగుతుందని భావించి హై అలర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. సభలు, సమావేశాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) నిషేధించాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఊహించినట్లుగానే ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో టెల్ అవీవ్పై విరుచుకుపడింది. రెండు ఇరాన్ డ్రోన్లు ఇజ్రాయెల్ కూల్చివేసింది. దాడులతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు తలదాచుకుంటున్నారు.
కాగా.. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లోని పలు అణుస్థావరాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇరాన్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భూగర్భంలో ఉన్న ఫోర్డో అణు శుద్ధి కేంద్రాన్ని తాము పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ప్రకటించారు. దానిపై ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామని తెలిపారు. భూగర్భంలోకి చొచ్చుకుని వెళ్లి విధ్వంసం సృష్టించడం బంకర్ బస్టర్ బాంబుల ప్రత్యేకత. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు దిగింది. అయితే అమెరికాపై ఎలా స్పందిస్తుందనే విషయం చూడాలి.