అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI | బ్యాంక్ గ్యారెంటీల పేరిట మోసానికి పాల్పడిన ఇద్దరిని సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh) ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మే9న మూడు కేసులు నమోదు చేసింది. ఇండోర్కు చెందిన ఒక కంపెనీ మధ్యప్రదేశ్ జల్ నిగమ్ లిమిటెడ్ (MPJNL)కు రూ. 183.21 కోట్ల మేర నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించడంపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
సదరు కంపెనీ 2023లో మధ్యప్రదేశ్లోని మూడు నీటిపారుదల ప్రాజెక్టులను MPJNL నుంచి పొందింది. వీటి విలువ రూ.974 కోట్లు. ఈ ఒప్పందాలకు మద్దతుగా రూ. 183.21 కోట్ల విలువైన ఎనిమిది నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను కంపెనీ సమర్పించింది.
CBI | 23 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించడంతో గుర్తించని MPJNL ఆ సంస్థకు రూ. 974 కోట్లకు పైగా విలువైన మూడు కాంట్రాక్టులను అప్పగించింది. తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సీబీఐ అధికారులు న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని 23 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PMB) సీనియర్ మేనేజర్తో సహా కోల్కతాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
CBI | ఇండోర్కు నిందితుల తరలింపు
కోల్కతాలో నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ స్థానిక న్యాయస్థానం ముందు హాజరు పరిచింది. ట్రాన్సిట్ రిమాండ్పై వారిపై ఇండోర్కు తీసుకు వెళ్లనున్నారు. కాగా కోల్కతాకు చెందిన ఒక సిండికేట్ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ కాంట్రాక్టులను పొందేందుకు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను తయారు చేసి చెలామణి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.