అక్షరటుడే, వెబ్డెస్క్: Indus water | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్ పై భారత్ అనేక రకాల ఆంక్షలు విధించింది. దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవడంతో పాటు 1960 నాటి సింధు జలాల (indus water) ఒప్పందాన్ని (IWT) రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ ను ఎడారిగా మార్చేసింది. ఏప్రిల్ 23న ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ లోని మూడు ప్రాంతాలలో నదీ జలాల ప్రవాహం గణనీయంగా తగ్గింది. జూన్ 20 నాటికి పాకిస్తాన్ లో నీటి ప్రవాహం గత సంవత్సరం ఇదే తేదీతో పోలిస్తే దాదాపు 20 శాతం తగ్గిందని పాకిస్తాన్ అధికారిక డేటా (Official Pakistani data) వెల్లడిస్తోంది.
Indus water | మూడు రీజియన్లలోనూ తగ్గుదల..
పాకిస్తాన్ రుతుపవనాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) అంతటా నీటి ప్రవాహంలో గణనీయమైన తగ్గుదల ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పంజాబ్ లో నీటి ప్రవాహం 1,30,800 క్యూసెక్కుల నుంచి 1,10,500 క్యూసెక్కులకు పడిపోయింది. ఇది 20 శాతానికి పైగా తగ్గింది. సింధ్ లో 1,70,000 క్యూసెక్కుల నుంచి 1,33,000 క్యూసెక్కులకు తగ్గగా, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 2,900 నుండి 2,600 క్యూసెక్కులకు స్వల్ప తగ్గుదల నమోదైంది. పాకిస్తాన్ లో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Indus water | సింధు జలాల మళ్లింపు..
పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం (central government) ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఈ నీటిని మళ్లించడం ద్వారా నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చాలని యోచిస్తోంది. సింధు, చీనాబ్ జలాలను (Indus and Chenab waters) బియాస్తో అనుసంధానించి, గంగాసాగర్ వరకు నీటిని తీసుకెళ్లడానికి 160 కి.మీ. పొడవైన సొరంగం నిర్మించాలని యోచిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితిని మరింత దయానీయంగా మార్చుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఎడారిలా మారిన పాకిస్తాన్.. భారత్ నీళ్లను ఆయుధంగా చేసుకుని తమపై యుద్ధం చేస్తోందని ఆరోపించింది. ఇది ఖరీఫ్ సీజన్ లో నీటి కొరతకు దారి తీస్తుందని పేర్కొంది. సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ఇప్పటివరకు నాలుగు లేఖలు పంపింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారత్ ను కోరింది. అయితే, ఈ ఒప్పందం నిలిపివేయబడిందని, “నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు” అని భారతదేశం స్పష్టం చేసింది.