అక్షరటుడే, వెబ్డెస్క్: Draupadi Murmu | అంధ విద్యార్థులు ఆలపించిన గీతాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే ఆమె కంట తడి పెట్టారు. ఉత్తరాఖండ్లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి తన 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్లోని(Dehradun) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసెబిలిటీని(Visually Disability) సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ గీతాలు ఆలపించారు. దీంతో భావోద్వేగానికి లోనైన ద్రౌపది ముర్ము(Draupadi Murmu) కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పిల్లలు ఎంతో అందంగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ‘కన్నీళ్లు ఆగలేదు. పిల్లలు చాలా చక్కగా పాడారు. ఇది వారి హృదయం లోతుల్లోంచి వచ్చిన పాట’ అని పేర్కొన్నారు. పుట్టుకతో వైకల్యంతో జన్మించిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు తీసుకువెళ్తే కచ్చితంగా వారు సక్సెస్ అవుతారన్నారు. వైకల్యంతో ఉన్న పిల్లల సాధికారత, సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్(Uttarakhand Governor Gurmeet Singh), ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Chief Minister Pushkar Singh Thami) పాల్గొన్నారు.