అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ సీఎం కేసీఆర్ (KCR) తప్పించుకోలేరని మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాశ్రావు (Gone Prakash Rao) అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఓ వైపు నిందితులను విచారిస్తునే బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయో వారి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గోనె ప్రకాశ్ రావు స్టేట్మెంట్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు రికార్డు చేశారు.
Phone Tapping Case | అంతా కేసీఆర్కు తెలిసే జరిగింది
సిట్ అధికారుల విచారణ అనంతరం ప్రకాశ్రావు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేసీఆర్కు తెలిసే జరిగిందని ఆయన అన్నారు. ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్ కేసీఆర్, సంతోష్ రావులకు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కులానికి చెందిన కొందరు అధికారులకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రభాకర్రావు రిటైర్డ్ అయ్యాక ఎస్ఐబీ చీఫ్ చేశారని, ప్రణీత్ రావుకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి డీఎస్పీ చేశారని చెప్పారు. కేటీఆర్, సంతోష్రావు కలిసి కవిత ఫోన్ ట్యాప్ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Phone Tapping Case | ట్యాపింగ్తోనే ఓటుకు నోటు వెలుగులోకి..
ఫోన్ ట్యాపింగ్ చేయడంతోనే ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిందని ప్రకాశ్రావు అన్నారు. అంతేగాకుండా సొంత పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, రేగా కాంతారావు ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంగా విచ్చలవిడిగా ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్, సినిమా వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు.
Phone Tapping Case | ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పదని ప్రకాశ్రావు అన్నారు. ఆగస్టు 5 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు (supreme court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 5 తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రకాశ్రావు తెలిపారు. అనంతరం కస్టడీకి తీసుకుంటారని, తర్వాత కేసీఆర్ పేరు బయటకు వస్తుందన్నారు.
Phone Tapping Case | అప్పుడే బీజేపీకి అవకాశం
బీఆర్ఎస్(BRS) బలహీనం అయితేనే రాష్ట్రంలో బీజేపీ(BJP)కి అవకాశం ఉంటుందని గోనె ప్రకాశ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేపట్టి కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయకపోవడంతో 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచిందన్నారు. తర్వాత కవితను అరెస్ట్ చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో అయిపోయిందని, బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని చెప్పారు. కాబట్టి బీజేపీ బలపడాలంటే సీబీఐతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.