అక్షరటుడే, ఇందూరు: Bhubarathi | భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) ఎంపికైన అభ్యర్థుల శిక్షణ తరగతులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు లైసెన్స్ సర్వేయర్ల (Licensed Surveyors) సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి శిక్షణ ఇప్పిస్తుందని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసి భూముల హద్దులు సమగ్ర వివరాలతో మ్యాపులను సమర్పిస్తే.. వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్బుక్లో జత చేయాలని సూచించారు.
Bhubarathi | ఎప్పటికప్పుడు నేరుగా పర్యవేక్షిస్తా.. కలెక్టర్
50 రోజుల పాటు కొనసాగే శిక్షణను సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతలు నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ఎంతో ముఖ్యమని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని, ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందన్నారు. కలెక్టర్ వెంట సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ తదితరులున్నారు.