అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలో వారం రోజుల క్రితం భారీ ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఈ క్రమంలో రైతుబజార్ వెనుక ప్రాంతంలో సైతం ఓ చెట్టు కూలి ఇంటిపై ఒరిగింది. మిగతా చోట్ల చెట్లు తొలగించిన సిబ్బంది.. దీనిని మాత్రం ఇప్పటి వరకు తొలగించలేదు. ఈ ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అలాగే స్థానికుల రాకపోకలు కొనసాగుతుంటాయి. చెట్లును తొలగించకపోవడంతో ఎప్పుడు పడిపోతుందోననే ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై అధికారులకు వివరించినా కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చెట్టుకు ఆనుకుని విద్యుత్ తీగలు కూడా ఉన్నాయని.. దీంతో చెట్టు మరింత కూలితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్శాఖ సిబ్బంది కాని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని, రైతు బజార్ సిబ్బంది గాని పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. నిత్యం వాహనాలు తిరిగే మార్గంలో ఓ ఇంటిపై చెట్టు కూలి వారం రోజులు గడుస్తున్నా తమకు సంబంధం లేనట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.