అక్షరటుడే, వెబ్డెస్క్: Flight Safety | అహ్మదాబాద్ విమాన దుర్ఘటన(Ahmedabad plane crash) నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాల భద్రతపై మరింత దృష్టి సారించింది. విమానాశ్రయాలతో పాటు చుట్టుపక్కల విమానాల భద్రత(Flight Safety)కు ఉన్న ప్రమాదాలను తొలగించే లక్ష్యంతో కొత్త ముసాయిదా నియమాలను జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రతిపాదిత విమాన (అడ్డంకుల కూల్చివేత) నియమాలను నోటిఫై చేసింది. ఇవి అధికారిక గెజిట్లో ప్రచురించిన అనంతరం అమలులోకి వస్తాయి. ఏరోడ్రోమ్ జోన్(Aerodrome zone)లలో ఎత్తు పరిమితులను ఉల్లంఘించే భవనాలు, చెట్లు, ఇతర నిర్మాణాలను నియంత్రించడంలో ఈ ముసాయిదా నియమాల లక్ష్యం. అటువంటి అడ్డంకులను తొలగించడానికి సకాలంలో చర్య తీసుకోవడానికి అధికారులకు ఇప్పుడు మరింత విశేషమైన అధికారం లభిస్తుంది. ముసాయిదా నియమాలపై పౌరవిమానయాన శాఖ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది. 20 రోజుల్లోపు ప్రజలు తమ సూచనలను నేరుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(Director General of Civil Aviation)కు పంపవచ్చు.
Flight Safety | నిర్ణీత ఎత్తు దాటితే కూల్చేయడమే..
తాజా ముసాయిదా ప్రకారం, విమానాశ్రయాల సమీపంలో నిర్దేశిత ఎత్తుకు మించి ఉన్న నిర్మాణాలను తొలగించే అవకాశముంది. నిర్ణీత ఎత్తుకంటే ఎక్కువగా ఉన్న నిర్మాణాల యాజమాన్యాలకు సంబంధిత ఏరోడ్రోమ్ అధికారి నోటీసు ఇస్తారు. యజమానులు నిర్మాణ కొలతలు, సైట్ ప్లాన్తో సహా వివరణాత్మక సమాచారాన్ని 60 రోజుల్లోపు సమర్పించాలి. నోటీసుకు బదులు ఇవ్వకపోతే నిర్మాణాన్ని కూల్చివేయడం లేదా ఎత్తు తగ్గించడం వంటి చర్యలు చేపడతారు. ఉల్లంఘనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలు, చెట్లను తొలగించాలని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (DGCA) లేదా అధీకృత అధికారి ఉత్తర్వు జారీ చేయవచ్చు. ఈ ఆర్డర్ను 60 రోజుల్లోపు కచ్చితంగా అమలు చేయాలి.