అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. నూతనంగా నిర్మిస్తున్న వంతెన(Bridge) గుంతలో కారు బోల్తా పడగా.. ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గేటు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ నుంచి బోధన్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా మల్లయ్యపల్లి గేటు(Mallaiahpalli Gate) వద్ద వంతెన నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి గుంతలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Yellareddy | మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
మృతులది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్ రావుపల్లి తండాగా(Narsing Raopalli Thanda) గుర్తించారు. వీరు వర్ని మండలం పెద్దగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ పీర్యా(38), మరో వ్యక్తి పీర్యా(32) మృతి చెందారు. గాయపడ్డ ముగ్గురిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. పనులు జరుగుతున్న చాలా చోట్ల కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సంబంధిత కాంట్రాక్టర్(Contractor), అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.