అక్షరటుడే, వెబ్డెస్క్: Donald Trump | ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య తీవ్ర ఉద్రక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్(Pakistan Army Chief Asif Munir)కు విందు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని మునీర్ పిలుపునిచ్చిన తర్వాత వైట్హౌస్(White House)లో ఇద్దరి మధ్య అరుదైన సమావేశం జరిగింది. పాకిస్తాన్ సైనిక అధిపతి జనరల్ అసిమ్ మునీర్కు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు. వాస్తవానికి ఒక దేశ ఆర్మీ చీఫ్కు అమెరికా అధ్యక్షుడు(US President Donald Trump) విందు ఇవ్వడం అనేది చాలా అరుదు. అంతకు ముందు అయూబ్ఖాన్, జియా అల్ హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి వారికి ఆహ్వానం అందినప్పటికీ, ఆ సమయంలో వాళ్లు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఆర్మీ చీఫ్గా ఉన్న మునీర్కు అమెరికా ఆహ్వానం పలుకడం, ట్రంప్ విందు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఓవైపు ఇరాన్కు పాకిస్తాన్ సన్నిహిత దేశం కావడం, మరోవైపు, యుద్ధరంగంలోకి దిగుతుందన్న వార్తల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Donald Trump | పరస్పర ప్రశంసలు..
వైట్హౌస్లో భేటీ సందర్భంగా ట్రంప్, మునీర్ పరస్పర ప్రశంసలు చేసుకున్నారు. ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య మే నెలలో జరిగిన స్వల్ప సైనిక ప్రతిష్టంభన అణు యుద్ధంగా మారే అవకాశాన్ని నిరోధించడంలో ట్రంప్ పాత్రను మునీర్ ప్రశంసించారని వైట్హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ తెలిపారు. మరోవైపు, పాకిస్తాన్ తమ మిత్ర దేశమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇండియా, పాక్ మధ్య ప్రతిష్టంభనను తాను విజయవంతంగా నిరోధించగలిగానని పాత పాటే పాడారు.
వాస్తవానికి ట్రంప్తోనే రెండ్రోజుల క్రితం ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ(Prime Minister Modi).. పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదిస్తేనే తాము వెనక్కి తగ్గామని, ఇందులో మధ్యవర్తి ప్రమేయం లేదని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు తన పాత వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. “నేను పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపాను. నేను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. “మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి. నేను నిన్న రాత్రి అతనితో మాట్లాడాను. మేము భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని” అని వివరించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య యుద్దాన్ని నిలువరించిన తన గురించి ఒక్క కథ కూడా రాయలేదని అసహనం వ్యక్తం చేశారు.