అక్షరటుడే, వెబ్డెస్క్: Uttar Pradesh | ఈ మధ్య వివాహేతర సంబంధాల ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి కేసులు ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హర్దోయ్ జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్య ప్రియుడితో ఉండగా చూసిన భర్త తీవ్ర ఆగ్రహంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్దోయ్ జిల్లా(Hardoi District) పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ, అదే గ్రామానికి చెందిన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. ఆమె భర్త రామ్ ఖిలావన్, భార్యను రహస్యంగా అనుసరిస్తూ ప్రియుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య ప్రియుడితో ఉండడాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
Uttar Pradesh | అలా చేశాడేంటి?
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా.. మాటామాటా కూడా పెరిగింది. ఈ సమయంలో తీవ్ర కోపోద్రిక్తుడైన రామ్ ఖిలావన్, ప్రియుడి ఎదుటే తన భార్య ముక్కును బలంగా కొరికడంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హరియావాన్ పోలీసులు(Haryavan Police) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను హర్దోయ్ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
ఈ ఘటనపై అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్(Additional SP Narendra Kumar) మాట్లాడుతూ “నిందితుడైన భర్త రామ్ ఖిలావన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాల వలన పచ్చని జీవితాలు పాడవుతున్నాయి. వీరి వలన పిల్లలు అనాథలవుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కొందరిలో మార్పు రాకపోవడం దారుణం.