అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS | కొంతకాలంగా సైలెన్స్గా ఉన్న బీఆర్ఎస్ (BRS party) పార్టీ మళ్లీ పోరుబాట పట్టనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడానికి గులాబీ బాస్ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన త్వరలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
BRS | కార్యకర్తల్లో అయోమయం
కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case), ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ విచారణ తదితర అంశాలతో బీఆర్ఎస్లో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కవిత ఎపిసోడ్తో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు సైలెన్స్గా ఉండిపోయారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR)) అధికారం పోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోకి అంతగా వెళ్లడం లేదు. ఫామ్హౌస్కే పరిమితం అయినా గులాబీ బాస్ చివరి సారి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడారు. దీంతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి మరో ఉద్యమం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
BRS | సాగునీటి ప్రాజెక్ట్లపై..
తెలంగాణ ఉద్యమంతో అంచలంచెలుగా ఎదిగి పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. మళ్లీ ఉద్యమం ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట సాగిన ఉద్యమంతో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా బీఆర్ఎస్ సాగునీటి ప్రాజెక్ట్లతో పాటు రైతాంగ సమస్యలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.
కాళేశ్వరంపై నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని ప్రజలకు వివరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్తో తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.