అక్షరటుడే, వెబ్డెస్క్: PM Kisan | ఈ-కేవైసీ(E-KYC) చేయించుకోని రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇక నుంచి వర్తించకపోవచ్చు. ఈ-కేవైసీతో పాటు బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ అనుసంధానం చేయించని రైతులకు కేంద్ర ప్రభుత్వ(Central Government) డబ్బులు అందవు. రైతులను ఆదుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను తీసుకొచ్చింది. పంట పెట్టుబడి సాయం చేసేందుకు కేంద్రం ఏటా రూ.6 వేల చొప్పున రైతులకు(Farmers) అందజేస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. ఎన్ని ఎకరాలున్నా సంబంధం లేకుండా, భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ నగదు సాయాన్ని అందిస్తోంది. అయితే, తెలంగాణలో అమలవుతున్న రైతుభరోసా తరహాలో కాకుండా అసలైన రైతులకే పెట్టుబడి సాయం వర్తింపజేస్తోంది. ఐటీ టాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ను ఈ పథకం నుంచి మినహాయించింది.
PM Kisan | త్వరలోనే నిధుల జమ..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19 విడతల్లో రూ.2 వేల చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 20వ విడత నిధుల విడుదలకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 20వ విడత పీఎం-కిసాన్(PM Kisan) నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, జూన్ 20వ తేదీన బీహార్లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi).. అదే రోజు రైతుల ఖాతాల్లోకి 20వ విడత పీఎం-కిసాన్ నిధులు విడుదల చేస్తారని తెలుస్తోంది.
PM Kisan | ఆ రైతులకు వర్తించదు..
పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో చాలా మందికి ఈసారి నిధులు అందకపోవచ్చని భావిస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకోని రైతులందరికీ ఈసారి నగదు జమ కాదని అధికారులు చెబుతున్నారు. అలాంటి రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి మినహాయిస్తున్నట్లు తెలిసింది. రైతులు ఈ-కేవైసీ చేయించుకోవడంతో పాటు తమ బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానించుకోవాలని(Aadhaar link) అధికారులు సూచిస్తున్నారు. గతంలో సరైన IFSC కోడ్లు లేక, నిలిచిపోయిన ఖాతాల వల్ల చాలా మంది రైతులకు పీఎం కిసాన్ ప్రయోజనం దక్కలేదు.
ఈసారి స్థానిక అధికారుల ద్వారా భూమి యాజమాన్య ధ్రువీకరణ ఒక కీలకమైన అర్హతగా మారింది. భూమి రికార్డులు అసంపూర్ణంగా లేదా ధ్రువీకరించబడని రైతులకు కూడా నిధులు రాకపోవచ్చని చెబుతున్నారు. మరోవైపు, లబ్ధిదారులు PM-KISAN పోర్టల్లో తమ స్టేటస్ను చెక్ చేసుకోవాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కోరింది. సమస్యలు ఎదుర్కొంటున్న వారు సకాలంలో పరిష్కారం కోసం కామన్ సర్వీస్ సెంటర్లను (CSC) సందర్శించాలని లేదా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.