అక్షరటుడే, వెబ్డెస్క్: Single Use Plastic | ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM Chandra babu Naidu) అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా సర్క్యూలర్ ఎకానమీ సమీక్షలో సీఎం చంద్రబాబు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో సర్క్యులర్ ఎకానమీ రివ్యూ మీటింగ్ నిర్వహించగా, చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈభేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై రివ్యూలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా శుభ్రత, పర్యావరణ సంరక్షణ విషయంలో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
Single Use Plastic | ప్లాస్టిక్ కనిపించొద్దు..
ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సంచులకు(Plastic Bags) బదులుగా క్లాత్ సంచుల వినియోగాన్ని విరివిగా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్(Reduce-Reuse-Recycle) సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీపై తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మొదటగా మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలన్నారు.
తక్కువ ఖర్చుతో (Lowest Cost) ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా వాటిని అభివృద్ధి చేయాలన్నారు. అలాగే, వృథాగా పోతున్న ప్లాస్టిక్, ఇతర రీసైకిలబుల్ పదార్థాల నుంచి ఆదాయాన్ని సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు సీఎం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో లేటెస్ట్ మిషన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అంతేకాదు వేస్ట్ నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి స్వచ్ఛత అవార్డులు ఇవ్వాలన్నారు సీఎం. మరోవైపు రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని.. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు.