అక్షరటుడే, వెబ్డెస్క్:Tehran | ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఖాళీ అవుతోంది. వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. టెహ్రాన్(Tehran)ను తక్షణమే వీడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) హెచ్చరించడం, ఇజ్రాయెల్ వందలాది క్షిపణులు ప్రయోగిస్తుండడంతో మూల్లెమూట సర్దుకుని రాజధానిని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్ లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. కాస్పియన్ సముద్రం వైపు, ఉత్తరం వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్ జామ్లతో నిండిపోయాయి.
Tehran | ఇజ్రాయెల్ హెచ్చరికలతో..
టెహ్రాన్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం(Israel army) హెచ్చరించింది. “రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్ అంతటా దాడులు చేస్తుంది. ఇరాన్(Iran) సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేస్తుందని” తెలిపింది. మరోవైపు ట్రంప్ కూడా టెహ్రాన్ను తక్షణమే వీడి వెళ్లాలని హెచ్చరించడంతో అక్కడి ప్రజలు ప్రానభయంతో పారిపోతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది.
రాజధాని నగరంలోని చాలా చోట్ల పేలుళ్లు సంభవించాయి. టెహ్రాన్లో సరైన షెల్టర్లు లేకపోవడం అక్కడి స్థానికులకు ప్రమాదకరంగా మారింది. పేలుడు దాటికి అనేక భవనాలు ధ్వంసం కాగా, ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని టెహ్రాన్ను వీడుతున్నారు.
మరోవైపు, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కోసం పొడవైన లైన్లు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్పై రేషన్ విధించారు. ప్రతి కస్టమర్కు 25 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. ATMలలో నగదు విత్డ్రాలపై పరిమితులు విధించారు.