అక్షరటుడే, వెబ్డెస్క్:G7 Summit | మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాదం విషయంలో ద్వంద వైఖరికి తావు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. కెనడాలో జరిగిన G7 ఔట్రీచ్ సెషన్(G7 Summit)లో ప్రసంగించిన ఆయన.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ, ఈ సంఘటనను భారతదేశంపైనే కాకుండా మానవత్వంపైనే జరిగిన తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యం ప్రపంచం ఏకం కావాలని పిలుపునిచ్చారు. అటువంటి బెదిరింపులను ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను పాటించవద్దని హెచ్చరించారు. “ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి పహల్గామ్పై మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపైన జరిగిన దాడి. ఇది మొత్తం మానవాళిపై దాడి” అని ప్రధాని మోదీ అన్నారు.
G7 Summit | మూల్యం చెల్లించక తప్పదు..
ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని మోదీ హెచ్చరించారు. ప్రపంచం తన సొంత ప్రాధాన్యతల ఆధారంగా ఆంక్షలు విధించడానికి తొందరపడుతుండగా, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందన్నారు. “ఒకవైపు, మన సొంత ప్రాధాన్యతల ఆధారంగా అన్ని రకాల ఆంక్షలను విధించడానికి మనం తొందరపడుతున్నాము. మరోవైపు, ఉగ్రవాదాన్ని(Terrorism) బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలకు ప్రతిఫలం లభిస్తుంది” అని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు అని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు వ్యతిరేకంగా నిలుస్తుందని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. “ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే, అది దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
G7 Summit | అనిశ్చితి సరికాదు..
గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ తెలిపారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థికానికి సంబంధించిన సంక్షోభాల వల్ల మొదట ఆయా దేశాలు ప్రభావితమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలు, ఆందోళనలను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం భారత్ తన బాధ్యతగా భావిస్తుందన్నారు. మరోవైపు, డీప్ఫేక్ వల్ల కలిగే నష్టాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ జనరేటెడ్ కంటెంట్(AI generated content) పై వాటర్ మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలని సూచించారు. ఈ శతాబ్దంలో టెక్నాలజీపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఏఐ చుట్టూ ఉన్న ఆందోళనలను పరిష్కరించి, ఆవిష్కరణలు ప్రోత్సహించాలని సూచించారు.