అక్షరటుడే, ఇందూరు: World Karate Day : తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ(Telangana Lee Martial Arts Academy) ఫౌండర్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బ్రూస్ లీ అవార్డ్ గ్రహీత ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు అంబరన్నoటాయి. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం విద్యార్థులు ఆనందోత్సాహాలతో కరాటే దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
కరాటే అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కరాటే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎడ్ల వెంకటేష్ మాట్లాడుతూ… ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే నేటితరంలో చదువుతో పాటు కరాటే నేర్చుకోవడం తప్పని సరి అని, ఎవరైనా తమపై అకారణంగా దాడి చేస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని సూచించారు.
ఇప్పటి వరకు అకాడమీ నుంచి 25 మంది బ్లాక్ బెల్ట్ డిగ్రీ సాధించారని, వారిని ఒకినవా మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ ప్రత్యేకంగా అభినందించారని వెంకటేష్ తెలిపారు. మే నెలలో జరిగిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో 19 మంది ఉత్తమ ప్రతిభ కనబరచారని వారికి బెల్ట్ లు, ప్రశంసా పత్రాలు అందజేసినట్టు తెలిపారు.
రానున్న రోజుల్లో జాతీయ(national), అంతర్జాతీయ(international) స్థాయిలో ప్రతిభ చూపేలా కరాటే విద్యార్థులను తయారు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ క్రీడాకారులు ఎడ్ల రిత్విక్, వైభవ్ తేజ్, సాయి నిహాల్, బ్రౌన్ బెల్ట్ క్రీడాకారులు శ్రీమాన్, సుమంత్, నచికేతన్ మొదలైనవారు పాల్గొన్నారు.