అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Trap | అవినీతి అధికారులు రోజు రోజుకు శృతి మించిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాల్లో బర్త్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే అన్ని పనులకు లంచాలు తీసుకుంటున్నారు. రూ.500 నుంచి మొదలుకొని రూ.లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయాల్లో (Municipal Offices) అయితే ఇంటి పర్మిషన్లు, ఇతర అనుమతుల కోసం చేతులు తడపనిదే పనులు చేయడం లేదు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా.. డబ్బులు ఇవ్వకపోతే అధికారులు కొర్రీలు పెడుతూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ మున్సిపల్ ఏఈఈ (Municipal AEE) ఏసీబీ అధికారులకు చిక్కింది.
మేడ్చల్ మల్కాజ్గిరి (Medchal Malkajgiri) జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం (Kapra Municipality)లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ పరిధిలోని చర్లపల్లి ఏఈఈ స్వరూప కాంట్రాక్టర్ను చేసిన పనులను ఎం బుక్లో నమోదు చేయడానికి రూ.1.20 లక్షల లంచం అడిగింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం ఏఈఈ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయాలి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.