అక్షరటుడే, వెబ్డెస్క్: ATM | దేశంలో రూ.500 నోట్ల సంఖ్య(Rs.500 notes) తగ్గిపోతోంది. ప్రస్తుతం ఏటీఎంలలో ఎక్కువగా రూ.వంద, రూ.200 నోట్లు వస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా రూ.100, రూ.200 నోట్లే ఎక్కువ సంఖ్యలో ఇస్తున్నారు.
ముఖ్యంగా ఏటీఎం(ATM)లలో చిన్న నోట్ల లభ్యత పెరిగింది. గతంలో ఎటీఎం సెంటర్లలో ఎక్కువగా రూ.500 నోట్లు పెట్టేవారు. అయితే ప్రజలు ఎక్కువగా వాడే నోట్ల లభ్యతను పెంచే ఉద్దేశంతో బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు(White label ATM operators) వాటి ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు అందుబాటు ఉంచాలని ఏప్రిల్లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏటీఎంలలో ఈ మేరకు ఆయా నోట్లను ఎక్కువగా పెడుతున్నారు.
ATM | 73 శాతానికి పెరిగిన వైనం
గత డిసెంబర్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత ఏటీఎంలలో 65 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 73 శాతానికి పెరిగింది. 2025 సెప్టెంబరు 30 నాటికి 75 శాతం, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో రూ.100 లేదా రూ. 200 నోట్ల ఉపసంహరణ జరగాలని ఆర్బీఐ(RBI) ఆదేశించింది. దీంతో ఆయా బ్యాంకులు, ఏటీఎంలను నిర్వహించే సంస్థలు చర్యలు చేపట్టాయి.
ATM | బ్యాంకుల్లో సైతం..
ప్రస్తుతం బ్యాంకుల్లో(Banks) సైతం ఎక్కువగా రూ.100, రూ.200 నోట్లనే ఇస్తున్నారు. దీంతో మార్కెట్లో రూ.500 నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం(Central Government) 2016 నవంబర్లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.500, రూ.రెండు వేల నోట్లను తీసుకొచ్చింది. అనంతరం కొద్ది రోజులకు రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది. దీంతో ప్రస్తుతం రూ.500 నోటే పెద్దది. అయితే వీటి సంఖ్య కూడా తగ్గించడానికే కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.