అక్షరటుడే, వెబ్డెస్క్:LRS | లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు పెంచుతూ ప్రభుత్వం మరో సారి ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం బీఆర్ఎస్(BRS) హయాంలో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ప్రక్రియను తర్వాత చేపట్టకుండా అలాగే వదిలేశారు.
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లను క్రమబద్దీకరించుకుంటే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. మార్చి 31 వరకు ప్లాట్లను క్రమబద్దీకరించుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. అయితే ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్పందన మేరకు ఈ గడువును తర్వాత ఏప్రిల్ 30 వరకు పెంచింది. మళ్లీ మే 31 వరకు ఛాన్స్ ఇచ్చిన అధికారులు తాజాగా జూన్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ(Municipal Department) ఆదేశాలు జారీ చేసింది.
LRS | రూ.రెండు వేల కోట్ల ఆదాయం
రాష్ట్రంలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించి రెగ్యూలరైజేషన్(Regularization) చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అందరు ఫీజు చెల్లిస్తే రూ.10 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం రానుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉండటంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పెంచింది. దీంతో కొంతైన ఆదాయం సమకూరుతుందని సర్కార్ యోచిస్తోంది.