అక్షరటుడే, వెబ్డెస్క్: G7 Summit | విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సోమవారం కెనడా చేరుకున్నారు. ఆల్బెర్టాలోని సమీపంలోని కననాస్కిస్ లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశం(G7 Summit)లో ఆయన పాల్గొననున్నారు. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి. మంగళవారం G7 ఔట్రీచ్ సెషన్లో ప్రసంగం అనంతరం మోదీ క్రొయేషియాకు బయల్దేరి వెళ్తారు. అంతకు ముందు ఆతిథ్య కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ(Canadian PM Mark Carney)తో సహా వరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. “సమ్మిట్లో G-7 దేశాల నాయకులు, ఇతర ఔట్రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, టెక్నాలజీ, ఆవిష్కరణలు, ముఖ్యంగా AI-శక్తి సంబంధాలు, క్వాంటం-సంబంధిత సమస్యలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రధానమంత్రి మోదీ చర్చిస్తారని” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ(Foreign Affairs Ministry) తెలిపింది.
G7 Summit | పదేళ్ల తర్వాత కెనడాకు.
భారతదేశం-కెనడా(India-Canada) దౌత్య వివాదం తర్వాత ప్రధాని మోదీ దాదాపు పదేళ్ల తర్వాత ఆ దేశానికి వెళ్లారు. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించారు. అనంతరం అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరి కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దారుణంగా పడిపోయాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం రెండు దేశాల సంబంధాలను దారుణంగా దెబ్బ తీసింది. దీనికి ప్రతిగా కెనడా తీవ్రవాద, భారత వ్యతిరేక శక్తులను కలిగి ఉందని కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆందోళన వ్యక్తం చేయడంతో దౌత్య సంబంధాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. అయితే, జస్టిన్ ట్రూడోను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం కెనడా ప్రధానిగా కార్నీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇండియాతో సత్సంబంధాలను పెంపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 సదస్సుకు హాజరు కావాలని మోదీని ఆహ్వానించారు.