అక్షరటుడే, హైదరాబాద్: Old City Metro : జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పాత బస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు కీలక అడుగు పడింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana government) రూ.125 కోట్లు మంజూరు చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ నుంచి విడుదలైన తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి ఈ నిధులు కేటాయించింది.
“మెట్రో కనెక్టివిటీ టు ఓల్డ్ సిటీ” స్కీమ్ కింద ఈ నిధులు మంజూరయ్యాయి. ఫైనాన్స్ (DCM) శాఖ జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆధారంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ మంజూరు జరిగింది. ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఇందులో మొదటిగా రూ.125 కోట్లు వెంటనే విడుదల చేయనున్నారు. మిగతా రూ.375 కోట్లు తర్వాతి విడతలో విడుదల చేస్తారు.
Old City Metro | ఎన్నో ఏళ్లుగా..
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (Hyderabad Airport Metro Limited) ఖాతాలో ఈ నిధులు జమ చేయాలని, ఖర్చులను కచ్చితంగా నమోదు చేసి ప్రతినెల ప్రభుత్వం, అకౌంటెంట్ జనరల్కు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి ఎలంబర్తి కె. ఉత్తర్వు జారీ చేశారు. మెట్రో ద్వారా పాతబస్తీకి మెరుగైన కనెక్టివిటీ కల్పించాలన్న సర్కారు లక్ష్యం.. ఈ బడ్జెట్తో మరింత ముందుకు సాగబోతోంది.