అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం (central government) జన గణన(population Census)కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. జన గణనతో పాటు కుల గణన చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కుల గణనతో కూడిన 16వ జనాభా లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026 అక్టోబర్ 1 నుంచి లడఖ్ వంటి మంచు ప్రభావిత ప్రాంతాల్లో, మార్చి 1, 2027 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే జనాభా లెక్కింపు కోసం సన్నాహాలను హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) ఆదివారం కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ (Union Home Secretary Govind Mohan), ఇతర సీనియర్ అధికారులతో సమీక్షించారు.
జనాభా లెక్కింపు నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం అధికారిక గెజిట్లో ప్రచురించనున్నట్లు కేంద్రం తెలిపింది. రాబోయే జనాభా లెక్కింపు కోసం సన్నాహాలను కేంద్ర హోం కార్యదర్శి, రిజిస్ట్రార్ జనరల్ & భారత జనాభా లెక్కల కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, ఇతర సీనియర్ అధికారులతో హోంమంత్రి సమీక్షించారని పేర్కొంది.
Caste Census : రెండు దశల్లో గణన..
జనాభా లెక్కింపు రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో అంటే గృహాల జాబితా ఆపరేషన్ (House List Operation – HLO)లో, ప్రతి ఇంటి గృహ పరిస్థితులు, ఆస్తులు, ఇతర వివరాలు సేకరిస్తారు. రెండో దశలో అంటే జనాభా గణన (Population Enumeration – PE)లో, ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలను సేకరిస్తారు. జనగణనలో కుల గణన కూడా జరుగుతుందని కేంద్రం తెలిపింది.
Caste Census : లక్షల మందితో గణన..
జనగణనలో లక్షల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. 34 లక్షల మంది గణనదారులు, పర్యవేక్షకులను నియమించనున్నారు. తదుపరి జనాభా గణనను మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి డిజిటల్(digital) మార్గాల ద్వారా నిర్వహిస్తారు. ప్రజలకు స్వీయ-గణన సదుపాయం కూడా అందుబాటులో ఉంచనున్నారు.