అక్షరటుడే, వెబ్డెస్క్: Dharmapuri : ఇంటి ఆవరణలో మనిషి చనిపోతే ఏమౌతుందోనని మూఢ నమ్మకంతో మూఢులుగా బతుకున్న ఇంటి యజమానులు.. అద్దెకు ఉన్నవారి పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడితే.. కనీసం ఇంట్లోకి కూడా రానీవడం లేదు. మానవత్వానికి మచ్చగా మిగిలే ఇలాంటి హృదయ విదారక ఘటన తాజాగా జగిత్యాల జిల్లా(Jagtial district) ధర్మపురి(Dharmapuri) పట్టణంలో చోటుచేసుకుంది.
గత్యంతరం లేని ఆ అద్దెకున్న అభాగ్యులు.. అనారోగ్యానికి గురై, పరిస్థితి విషమించిన తమ కుటుంబ సభ్యుడిని బతికుండగానే స్మశానానికి తీసుకెళ్లారు. చాలీచాలని వేతనంలో, ఉండటానికి ఇల్లు లేక, అగ్గిపెట్టెలాంటి అద్దె ఇంటిలో రూ. వేలల్లో బాడుగ చెల్లిస్తూ కూడా ఆపత్కాలంలో బయటకి నెట్టివేయబడ్డ ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ధర్మపురి(Dharmapuri)కి చెందిన రంగు గోపి అనే యువకుడు హోటల్(HOTEL) నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించిందని వైద్యులు(doctors) చెప్పడంతో అతడిని కుటుంబ సభ్యులు తిరిగి ధర్మపురికి తీసుకొచ్చారు.
కాగా, గోపికి సొంత ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాడు. అయితే, అనారోగ్యం బారిన పడి, పరిస్థితి విషమించిన అతడిని, అతడి కుటుంబాన్ని ఇంట్లోకి రావడానికి ఇంటి యజమాని అనుమతించలేదు. ఎంత బ్రతిమిలాడినా కనికరించలేదు. దీంతో గత్యంతరం లేక బతికుండగానే గోపి అతడి కుటుంబ సభ్యులు స్మశానానికి తరలించారు. అక్కడే ఆ యువకుడికి వారు సపర్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. కాటి(స్మశానం)(cemetery) స్థలంలో వీరి దీనస్థితి గమనించిన పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించారు. సంఘ భవనంలోకి ఆ వ్యక్తిని, కుటుంబ సభ్యులను తరలించి మానవత్వం చాటుకున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) తన వంతు సాయంగా రూ.పది వేలు స్థానిక నాయకుల పంపించారు.
అయితే, సొంత ఇల్లులేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని గుర్తుచేశారు. అద్దెకు ఉండేవారు చనిపోతే.. ఇంట్లోకి రానివ్వడం లేదని వాపోతున్నారు. ఫలితంగా నేరుగా స్మశాన వాటికకు తీసుకెళ్లిన ఘటనలు అనేకం ఉంటున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.