అక్షరటుడే, హైదరాబాద్: Gaddar Awards : హైటెక్స్ లో జరుగుతున్న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్స వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఈ దృశ్యం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్ఎసీ ఛైర్మన్ దిల్ రాజ్, ఎఫ్ఎసీ ఎండీ హరీశ్ కలిసి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. టాలీవుడ్ స్టార్ నటులు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, సీనియర్ కథా నాయికలు హీరోయిన్స్ సుహాసినీ, జయసుధ, హేమా మాలిని, సింగర్ సునీత, దర్శకులు రాజమౌళి, సుకుమార్, మురళీ మోహన్, కీరవాణి, సింగర్ రేవంత్, ఎస్ జే సూర్య తదితరులు హాజరయ్యారు. ఈ వేడుక ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
సీఎం అందరికీ కరచాలనం చేసుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డిని నటులు బాలకృష్ణ, అల్లు అర్జున్ ఆలింగనం చేసుకున్నారు.
సంధ్య థియేటర్లో బన్నీ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట పెద్ద ఇష్యూ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నీని జైలుకు పంపించారు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా దీనిపై గరంగరంగానే మాట్లాడారు.
కానీ, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో పుష్ప సినిమాకు గాను బన్నీ బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో బన్నీని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయలేదని తేలిపోయింది.
Gaddar Awards : పుష్ప 2 డైలాగ్…
ఇక గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా వేదికపై అల్లు అర్జున్ పుష్ప 2 డైలాగ్ తగ్గేదేలే.. అంటూ అందరినీ ఆకర్షించారు. కాగా, దీనికి ముందు వేదికపై ఉన్న సీఎం రేవంత్, ఇతరుల అనుమతి తీసుకుని డైలాగ్ సంధించారు. దీంతో వేదికపై ఉన్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్ఎసీ ఛైర్మన్ దిల్ రాజ్, ఎఫ్ఎసీ ఎండీ హరీశ్ చప్పట్లతో అభినందించారు.