అక్షరటుడే, హైదరాబాద్: AgriGold : అగ్రిగోల్డ్ బాధితుల (AgriGold victims) దశాబ్దాల పోరాటానికి త్వరలో న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. కడుపు కట్టుకుని కూడబెట్టిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు సర్వం సిద్ధం అవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు పంపిణీ చేసేందుకు కోర్టు అనుమతించింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేశారు.
అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు సంబంధించి రూ.611 కోట్ల విలువైన ఆస్తులను హైదరాబాద్ ఈడీ జోన్ కార్యాలయం(Hyderabad ED zone office) పునరుద్ధరించింది. ఈ ఆస్తుల అటాచ్మెంట్ సమయంలో వాటి విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.1,000 కోట్లను మించిపోయే అవకాశం ఉంది.
ఈ ఏడాది గత నెల(మే)లో ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 8(8) కింద పీఎంఎల్ఏ కోర్టు (PMLA court) లో పిటిషన్ దాఖలైయింది. ఇందులో అటాచ్ చేసిన స్థిర, చరాస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీకి విడుదల చేసి, ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించే నిమిత్తంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రకారం పునరుద్ధరించాలని కోరింది.
హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు జూన్ 10, 2025న (Special PMLA Court) ఈ పిటిషన్ను ఆమోదించింది. ఈ మేరకు 397 స్థిర ఆస్తుల పునరుద్ధరణకు మార్గం సుగమం అయింది. వీటిలో 13 తెలంగాణలో, 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో, 4 కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలో నివాస, వాణిజ్య స్థలాలు, వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్లు ఉన్నాయి.
అగ్రి గోల్డ్ గ్రూప్పై ఈడీ 2018లో దర్యాప్తు చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అండమాన్ & నికోబార్ లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ కేసు విచారణకు వచ్చింది. అగ్రి గోల్డ్ కంపెనీలు రియల్ ఎస్టేట్ పేరుతో పొంజీ స్కీమ్ ద్వారా సుమారు 19 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేశాయి. 130కి పైగా కంపెనీలను ఏర్పాటు చేసి జనాల వద్ద నుంచి ‘ప్లాట్ అడ్వాన్స్’ పేరుతో డిపాజిట్లు వసూలు చేశాయి. వేలాది కమిషన్ ఏజెంట్లను నియమించుకుని జనాలను మోసం చేసింది. ఈ డబ్బులను ఆ కంపెనీలు ప్రజలకు తెలియకుండా పవర్, ఆరోగ్యం, డెయిరీ, ఎంటర్టైన్మెంట్, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. కానీ, ఒప్పందం ప్రకారం డబ్బును వెనక్కి ఇవ్వడంలో మాత్రం విఫలమైంది.
AgriGold : భారీగా పెరిగిన ఆస్తుల విలువ
ఈడీ దర్యాప్తులో భాగంగా సుమారు రూ.4141.2 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. 2020 డిసెంబరులో అవ్వ వెంకట రామారావు, శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ మేరకు 2021 ఫిబ్రవరిలో 14 మందిపై ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. తర్వాత మార్చి 2024లో మరో 22 మందిపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సమర్పించింది.
అయితే, అంతకు ముందే అంటే ఫిబ్రవరి 2025లో రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ బాధితుల(ప్రస్తుత విలువ రూ.6,000 కోట్లు)కు పునరుద్ధరించింది. తాజా పునరుద్ధరణతో కలిపి మొత్తం రూ.3,950 కోట్ల విలువైన ఆస్తులను సంబంధిత బాధితులకు తిరిగి అప్పగించారు. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.7,000 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులకు ఈడీ తిరిగి ఆస్తుల పంపిణీ ప్రక్రియ చారిత్రక అడుగుగా నిలవనుంది.