అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections ) ప్రభుత్వం సిద్ధం అవుతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చూస్తోంది. ఈ మేరకు మంత్రి సీతక్క (Minister Seethakka) కీలక ప్రకటన చేశారు. వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని ఆమె తెలిపారు. మహబూబాబాద్ (Mahabubabad District) జిల్లాలో శుక్రవారం సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
Local Body Elections | 16 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరితో ముగిసింది. అప్పుడు ఎన్నికల నిర్వాహణకు సిద్ధంగా లేని ప్రభుత్వం పంచాయతీల బాధ్యతలను ప్రత్యేకాధికారులకు అప్పగించింది. దీంతో 16 నెలలుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పట్టించుకునే వారు లేక పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రత్యేకాధికారులు అసలు గ్రామాలకు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి.
పంచాయతీ కార్యదర్శులు (GP Secteterises) పలు పనులు చేయిస్తున్నా.. నిధులు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. చాలా గ్రామాల్లో చెత్త కూడా సేకరించడం లేదు. ఏమన్నా అంటే నిధులు లేవని కార్యదర్శులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు సిద్ధం అవుతున్నట్లు మంత్రి తెలపడం గమనార్హం.
Local Body Elections | మొదట సర్పంచ్.. తర్వాత ఎంపీటీసీ
ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం కూడా ముగియడంతో అక్కడ కూడా ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Local Body Elections | రిజర్వేషన్లపై స్పష్టత కరువు
తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కులగణన (Caste Census) చేపట్టిన విద్యా– ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం ఆమోదిస్తేనే ఆ బిల్లులకు చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో కేంద్రం ఆమోదించకుంటే బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఓటరు జాబితాను కూడా విడుదల చేసింది. అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అయితే అప్పుడు ప్రభుత్వం ఎన్నికలు పెట్టలేదు. దీంతో ప్రస్తుతం వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి నెలలోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Local Body Elections | రైతులు బిజిబిజి
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇప్పటికే రైతులు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. పలు చోట్ల ముందస్తు వరినాట్లు ప్రారంభం అయ్యాయి. అయితే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జూన్ 25 తర్వాతే నాట్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రైతులు, వ్యవసాయ కూలీలు బిజిబిజీగా ఉంటారు. ఆ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే సాగు పనులతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.