అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | వానాకాలం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad city) నగరంలో పలు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తారు. చిన్నపాటి వర్షం పడినా నగరంలోని చాలా కాలనీలు నీట మునుగుతాయి. వరద నీరు సాఫీగా వెళ్లే మార్గం లేక ఈ సమస్య ఏటా తలెత్తుతూనే ఉంది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
ఏళ్లుగా తమ కాలనీలో నాలా సమస్యతో ఇబ్బంది పడుతున్నామని చెప్పినా పట్టించుకోవడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే(MIM MLA)పై శుక్రవారం ప్రజలు తిరగబడ్డారు. ఈ క్రమంలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని యాకుత్పుర (Yakutpura) పరిధిలో నాలా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ (Nampally MLA Jafar Hussain) పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
Hyderabad | పరిశీలన కోసం వెళ్తే..
కాగా.. గురువారం కురిసిన వర్షానికి నాలా సమీపంలోని ఇళ్లలోకి వరద వచ్చింది. దీంతో పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఆయనపై తిరగబడ్డారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితకబాదారు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని, దీంతో ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.