అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | నగరంలో వరద ముప్పు ఉన్న పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) రంగనాథ్ పరిశీలించారు. గురువారం వేకువ జామున కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) వరద ముంచెత్తిన డోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించారు.
ఎగువ నుంచి వచ్చిన వరద సాఫీగా గోపి చెరువుకు చేరే మార్గం లేక శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం రోడ్డు, కాలనీని వరద ముంచెత్తింది. వర్షం నీరు, గోపి చెరువు నుంచి వచ్చిన వరదతో లింగంపల్లి అండర్ పాస్ లో నీరు నిలిచిందని స్థానికులు వివరించారు. అంతకు ముందు వరద ముప్పు ఉన్న కొండపూర్లోని కాసోరోస్ అపార్ట్మెంట్ పరిసరాలను ఆయన తనిఖీ చేశారు. వరద, మురుగు కాల్వలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. అనంతరం బాచుపల్లిలో పలు వరద కాల్వలను పరిశీలించారు. చెన్నం చెరువు నుంచి వచ్చే వరద రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా దిగువన ఉన్న బాచుపల్లి చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Hydraa | వరద ముప్పునకు పరిష్కారం
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు నగరంలోని రాజేంద్రనగర్ (Rajendra Nagar) మండలంలోని ఉప్పరపల్లి, శాస్త్రిపురం, పల్లె చెరువు ప్రాంతాలను కమిషనర్ సందర్శించారు. ఉప్పరపల్లిలోని అశోక్ విహార్ కాలనీలో మురుగు, వరద కాల్వలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను సందర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదలతో దాదాపు ఐదు అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న 400 కుటుంబాలు ఏడేళ్లుగా అవస్థలు పడుతున్నాయి. ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో స్పందించిన ఆయన వరద నీరు పోయేలా ఆయన కాలువ తవ్వించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.