అక్షరటుడే, వెబ్డెస్క్ : Plane Crash | వారంతా ఎన్నో కలలతో వైద్య విద్యలో చేరారు. ఎంబీబీఎస్(MBBS) చేసి త్వరలో డాక్టర్లు అవుతాము అని కలలు కన్నారు. కానీ విమాన ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి కలలను కల్లలు చేసింది. తమ బిడ్డలు డాక్టర్లుగా బయటకు వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను తీసుకు వెళ్లడానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ప్రయాణికుల కుటుంబాలతో పాటు బీజే మెడికల్ కాలేజీ (BJ Medical College)లో తీవ్ర విషాదాన్ని నింపింది. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలడంతో అందులో ఉన్న మెడికోలు మృతి చెందారు. భోజనం చేస్తున్న సమయంలో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది. ప్రమాదంలో 40 మంది వరకు వైద్య విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు.